1948 సెప్టెంబర్ 13వ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలాపూర్ నుంచి భారత సైన్యానికి చెందిన ఒక ప్లాటూన్ మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో మార్చి చేసి హైదరాబాద్ ను విమోచన చేసేందుకు రాష్ట్రంలో ప్రవేశించింది. అత్యవసరమైతే అందుబాటులోకి వచ్చేందుకు మరొక ప్లాటూన్ ను విజయవాడలో మోహరించారు.
మొదటి పోరాటం షోలాపూర్- సికింద్రాబాద్ హైవేపై నల్ దుర్గ్ కోటలో జరిగింది. అయితే హైదరాబాద్ దళాలను భారత సైన్యం ఓడించి కోటను స్వాధీనం చేసుకుంది. హైదరాబాదు దళాల్లో భారీగా ప్రాణ నష్టం జరగడంతో పాటు సైన్యం విశాలమైన భూభాగాన్ని కూడా కైవసం చేసుకుంది.
ఆ మరుసటి రోజు మరొక సైనిక బృందం ఉమార్గే నుంచి తూర్పున 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేశ్వర్ వైపు ముందుకు సాగి టెంపెస్ట్ విమానాల స్క్వాడ్రన్ల ద్వారా వైమానిక దాడుల సహాయంతో మధ్యాహ్నాని కల్లా రాజేశ్వర్ పై అదుపు సాధించింది.
జల్నా పట్టణాన్ని గూర్ఖా దళం అదుపులో ఉంచి సైన్యం లాతూర్ వైపు ముందుకు సాగింది. అనంతరం మోమీనాబాద్ లో వారికి గోల్కొండ లాన్సర్స్ మూడో దళం నుంచి నామమాత్రపు ప్రతిఘటన ఎదురైనప్పటికీ సెప్టెంబర్ 15వ తేదీన ఆ దళం లొంగిపోయింది. రజాకార్లు భారతీయ సైనిక దళాలతో తమ భూభాగంలో పోరాటం కొనసాగించినప్పటికీ, భారత సైన్యం 75 ఎంఎం తుపాకులు వినియోగించడంతో సెప్టెంబర్ 16వ తేదీన రజాకార్లు కూడా లొంగిపోవాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం భారత్ సైనిక బెటాలియన్లు ఒకవైపు నుంచి బీదర్లోకి ప్రవేశించి అనంతరం హింగోలి పట్టణంపై అదుపు సాధించారు. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల పట్టణం పైన మరోవైపు నుంచి సైన్యం అదుపు సాధించింది.